
ఎస్బీఐ నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న నగదు రూ. 41.6 ట్రిలియన్లకు చేరుకుంది, ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9% వృద్ధి. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా రూ. 314 ట్రిలియన్లకు పెరిగింది. అంటే మన దేశంలో నగదు డిజిటల్ పేమెంట్లు ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా కాకుండా, రెండూ సమాంతరంగా వృద్ధి చెందుతున్నాయి. తక్కువ విలువ గల లావాదేవీలలో యూపీఐ ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా రూ. 500 కంటే తక్కువ మొత్తానికి చేసే చెల్లింపులలో యూపీఐ వాటా 60 నుండి 86 శాతం వరకు ఉంది. అయితే, పెద్ద మొత్తంలో చేసే లావాదేవీలు లేదా అనిశ్చిత పరిస్థితుల కోసం ప్రజలు ఇప్పటికీ నగదుపైనే మొగ్గు చూపుతున్నారు.
నగదు నిల్వలు పెరగడానికి ప్రధాన కారణాలు
భారతదేశ తలసరి జీడీపీ వృద్ధి చెందడమే నగదు వినియోగం పెరగడానికి ఒక ప్రధాన కారణమని అధ్యయనం చెబుతోంది. ప్రజల ఆదాయం పెరగడంతో వారి వద్ద నగదు లభ్యత కూడా పెరిగింది. మరో కీలక అంశం ఏమిటంటే, సోషల్ మీడియా ద్వారా వ్యాపించే వార్తలు లేదా భవిష్యత్తుపై ఉండే అనిశ్చితి కారణంగా ప్రజలు ముందుజాగ్రత్త చర్యగా (Precautionary motive) చేతిలో నగదు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏటీఎంల నుండి విత్డ్రా చేసే మొత్తానికి ప్రజల వద్ద మిగిలిపోయే నగదుకు మధ్య అంతరం ఐదు రెట్లు పెరగడం దీనికి నిదర్శనం. ప్రజలు అత్యవసర పరిస్థితుల కోసం బ్యాంకు ఖాతాల్లో కంటే చేతిలోనే నగదు ఉండాలని భావిస్తున్నారు.
కరెన్సీ చలామణిలో నోట్ల వాటా..
ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నగదు విలువలో రూ. 500 నోట్ల వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు చిన్న నోట్ల సరఫరాను పెంచడంతో రూ. 100 నోట్ల వాటా 8.2%కి పెరిగింది. భారతదేశపు స్వంత డిజిటల్ కరెన్సీ (CBDC) ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ఇది మొత్తం నగదులో కేవలం 0.02% మాత్రమే ఉంది. ఆర్థిక వ్యవస్థ మరింత వ్యవస్థీకృతం అవుతున్న కొద్దీ, డిజిటల్ చెల్లింపులు సౌలభ్యం కోసం నగదు భద్రత కోసం వాడుతూ రెండూ కలిసి వృద్ధి చెందుతాయని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ‘యూపీఐ ప్రాచుర్యం పొందుతున్నా, భారతీయుల మనసులో నగదుదే పైచేయి’ అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఐ ద్వారా లావాదేవీలు సులభతరం అయినప్పటికీ, మానసిక భద్రత కోసం నగదును దగ్గర ఉంచుకోవడం భారతీయుల అలవాటుగా మారింది. నగదు డిజిటల్ పేమెంట్లు కలిసి సాగడమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకత.