
ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ గురించి నేర్చుకోవాలని ఉందా? కానీ వేలల్లో ఫీజులు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ఐఐటీ మద్రాస్, కేంద్ర విద్యాశాఖ సహకారంతో నడుస్తున్న ‘స్వయం ప్లస్’ ప్లాట్ఫామ్ ద్వారా అతి తక్కువ ధరకే ఏఐ కోర్సులను నేర్పిస్తోంది. ఇందులో జస్ట్ రూ.100 నుండే ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం రండి…
అందరికీ ఏఐ..
స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి 3 కొత్త కోర్సులను ప్రారంభించారు. ‘ఏఐ ఫర్ ఆల్’ ప్రచారంలో భాగంగా ఏఐ పరిజ్ఞానం సామాన్యులకు కూడా అందాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు. ఈ కోర్సుల ప్రత్యేకత ఏంటంటే.. వీటిని నేర్చుకోవడానికి మీకు ముందుగా కోడింగ్ లేదా ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.
కోర్సుల వివరాలు:
ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ భాగస్వామ్యంతో లాంచ్ చేసిన ఈ 3 కోర్సులు విభిన్న రంగాల వారికి ఉపయోగపడతాయి:
* ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్: మేనేజ్మెంట్ నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తమ నిర్ణయాల్లో ఏఐ, జనరేటివ్ ఏఐ టూల్స్ను ఎలా వాడాలో ఇందులో నేర్పిస్తారు. దీని ధర కేవలం రూ.100 మాత్రమే. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.
* ప్రాంప్ట్ ఇంజనీరింగ్: ఏఐ సిస్టమ్స్ నుంచి సరైన సమాచారాన్ని ఎలా రాబట్టాలో నేర్పే ఈ కోర్సు కూడా రూ.100కే అందించబడుతోంది. దీనికి కూడా జీఎస్టీ అధికం.
* ఏఐ ఫర్ ఆస్పైరింగ్ ఇంజనీర్స్: స్కూల్ నుంచి ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టే విద్యార్థుల కోసం దీనిని రూపొందించారు. ఇందులో పైథాన్, మెషిన్ లెర్నింగ్ వంటి బేసిక్స్ ఉంటాయి. దీని ధర రూ.500గా నిర్ణయించగా జీఎస్టీ అదనం.
రిజిస్ట్రేషన్ గడువు:
ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు స్వయం ప్లస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మే 10, 2026. ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్లో 5.50 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడం దీని క్రేజ్ను తెలియజేస్తోంది.
గత ఏడాది ప్రారంభించిన మొదటి బ్యాచ్లకు 90 వేల మందికి పైగా అప్లై చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఏఐ కోర్సులు నేర్చుకోవడం వల్ల అకడమిక్ గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఒక సినిమా టికెట్ ధర కంటే తక్కువ ఖర్చుతో భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను యువత సొంతం చేసుకోవచ్చు.