
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు తమ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులు, ప్రమోటర్ల వాటాల వివరాలను ఎప్పటికప్పుడు సెబీకి నివేదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కంపెనీ యజమానులు (ప్రమోటర్లు) తమ వద్ద ఉన్న షేర్లను ఎక్కడైనా కుదువ పెట్టినప్పుడు, ఆ సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా బహిర్గతం చేయాలి. ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ నిబంధనలలో చిన్నపాటి జాప్యం జరిగినా, సెబీ దానిని తీవ్రంగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజాగా మణప్పురం ఫైనాన్స్ అధినేత విషయంలో జరిగినది కూడా ఇటువంటి నిబంధనల ఉల్లంఘనే.
మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వి.పి. నందకుమార్కు భారత సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) పరిపాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. షేర్ల కుదువకు సంబంధించిన వివరాలను ఆలస్యంగా వెల్లడించినందుకు గాను ఈ చర్య తీసుకుంది.
2018 సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య జరిగిన కొన్ని లావాదేవీలకు సంబంధించి, నందకుమార్ తన షేర్లను కుదువ పెట్టారు. నిబంధనల ప్రకారం.. ఈ వివరాలను తక్షణమే స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలి. కానీ.. ఆయన ఆ సమాచారాన్ని అక్టోబర్ 11, 2018న సమర్పించారు. అంటే, గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఈ సమాచారం ఫైల్ చేయబడింది.
సెబీ నిబంధనల ఉల్లంఘన…
సెబీ నిబంధనలు ప్రకారం.. ప్రమోటర్లు తమ షేర్లపై ఎటువంటి భారాన్ని సృష్టించినా.. విడుదల చేసినా నిర్ణీత గడువులోగా వెల్లడించాలి. ఈ గడువును పాటించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది.
ఈ హెచ్చరిక కేవలం నందకుమార్కు ఆయన వ్యక్తిగత హోదాలో మాత్రమే జారీ చేయబడింది. దీనివల్ల కంపెనీపై ఎటువంటి ఆర్థిక జరిమానా విధించలేదు. ఈ హెచ్చరిక వల్ల మణప్పురం ఫైనాన్స్ ఆర్థిక స్థితిపై గానీ, రోజువారీ వ్యాపార కార్యకలాపాలపై గానీ ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇటువంటి హెచ్చరికలు సాధారణంగా భవిష్యత్తులో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించడానికి ఇస్తారు. కంపెనీ సెక్రటరీ అపర్ణ మీనన్ ఈ వివరాలను అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించారు. నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా వ్యవహరిస్తామని కంపెనీ పేర్కొంది.