
Anna Hazare: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్కు భారీ షాక్ ఇచ్చారు. తనతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2/3 వంతు సభ్యులు బీజేపీలో చేరడంతో, రాజ్యసభలో ఆ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్లే. ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి ప్రజా కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజస్వామ్యంలో ప్రతీ వ్యక్తికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. వరసగా నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై ఆప్ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. పార్టీలో ఏదో ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే వారు పార్టీని వీడినట్లు చెప్పారు. మహారాష్ట్ర అహిల్యానగర్ జిల్లాలో శుక్రవారం హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇదంతా ఆప్ నాయకత్వం తప్పే, ఆ పార్టీ సరైన మార్గంలో నడిచి ఉంటే, వారు పార్టీని వీడేవారు కాదు’’ అని హజారే చెప్పారు. ఒకరు పార్టీని వీడాలనే నిర్ణయం వెనక కొన్ని అంతర్లీన కారణాలు ఉంటాయని, వీటిని విస్తృత ప్రజాస్వామ్య కోణంలో చూడాలని హజారే చెప్పారు. చద్దాతో సహా ఇతరులు పార్టీ వీడటానికి, ఏ పార్టీలో చేరాలనే దానిపై ప్రతీ వ్యక్తికి అభిప్రాయం ఉంటుందని ఆయన అన్నారు.
2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారేతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేశారు. ఢిల్లీలో నిరసనలు, నిరాహార దీక్షల సమయంలో కేజ్రీవాల్, హజారే కలిసి పనిచేశారు. రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.