
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటేనే విలాసానికి మారుపేరు. ముఖ్యంగా సముద్ర ముఖద్వారం వైపు ఉండే బంగ్లాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా జుహు తారా రోడ్లోని ఐకానిక్ ‘లీలా బంగ్లా’ కళ్లు చెదిరే ధరకు అమ్ముడై ముంబై రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 7 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ హెరిటేజ్ ప్రాపర్టీ ఏకంగా రూ.221 కోట్లకు చేతులు మారింది.
ఈ బంగ్లా కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు. ముంబైలోని అరుదైన ‘ఆర్ట్ డెకో’ నిర్మాణ శైలికి నిదర్శనం. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా కలిగిన ఈ భవనం 1,355 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ నిర్మాణంతో దాదాపు 8,480 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాను కలిగి ఉన్న ఈ ప్రాపర్టీలో.. 5,000 చదరపు అడుగుల గార్డెన్.. 2,500 చదరపు అడుగుల టెర్రస్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
నానావతి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన గౌతమ్ నానావతి ఫ్యామిలీ ఈ ప్రాపర్టీకి యజమానిగా ఉండేది. దీనిని ప్రఖ్యాత మహేష్ నోటందాస్ జ్యువెలర్స్ గ్రూప్కు చెందిన నోటందాస్ రియల్టీ దక్కించుకుంది. ఈ డీల్లో భాగంగా నోటందాస్ డైరెక్టర్లు, తండ్రీకొడుకులైన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని ఈ భారీ లావాదేవీని పూర్తి చేశారు.
Also Read : సంపన్నుల నయా అడ్డాగా న్యూజిలాండ్..
ముంబై వెస్ట్రన్ సబర్బ్స్లో ఇలాంటి స్టాండలోన్ ప్రాపర్టీలు లభించడం చాలా అరుదు. అందుకే హెరిటేజ్ నిబంధనల వల్ల కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, వీటి కోసం అటు డెవలపర్లు, ఇటు సంపన్న వ్యాపారవేత్తలు భారీగా పోటీ పడుతుంటారు. తాజా డీల్ ముంబైలోని లగ్జరీ ప్రాపర్టీలకు సంపన్నుల నుంచి ఉన్న విపరీతమైన డిమాండ్ను మరోసారి నిరూపించింది.