Reading Time: < 1 minute
India England T20i Matches To Start One Hour Early Know Complete Details Here

భారత క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక తీపి కబురు అందించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ (T20I) సిరీస్ ప్రారంభ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత ఉపఖండంలో టెలివిజన్ వీక్షకుల సంఖ్యను (TRP) గరిష్టంగా పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

పూర్వపు షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు (ఇంగ్లాండ్ స్థానిక సమయం సాయంత్రం 6:30 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు చూడటం భారతీయ అభిమానులకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లను రాత్రి 10:00 గంటలకే (IST) ప్రారంభించనున్నారు.

బ్రాడ్‌కాస్టర్ల విజ్ఞప్తి మేరకు.. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగిన బ్రాడ్‌కాస్టర్లతో జరిపిన చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.  “ఇంగ్లాండ్ వేదికగా జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయాలను ఈసీబీ (ECB), మ్యాచ్ జరిగే వేదికలు, ప్రత్యర్థి దేశాల క్రికెట్ బోర్డులు, అలాగే స్వదేశీ, విదేశీ బ్రాడ్‌కాస్టర్ల పరస్పర సంప్రదింపుల తర్వాతే ఖరారు చేస్తారు. ఈ సిరీస్ విషయానికి వస్తే స్కై స్పోర్ట్స్ (యూకే), సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (భారత్) లతో చర్చించి సమయాన్ని మార్చడం జరిగింది” అని నివేదిక పేర్కొంది.

ప్రపంచకప్ విజేతలైన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు అంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాత్రి 10 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావడం వల్ల ప్రైమ్ టైమ్‌లో ఎక్కువ మంది వీక్షకులు టీవీలకు, డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఇది అటు అభిమానులకు, ఇటు ప్రకటనల ద్వారా ఆదాయం పొందే బ్రాడ్‌కాస్టర్లకు ఇద్దరికీ లాభదాయకమైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.