
నేటి వేగవంతమైన ప్రపంచంలో సాంకేతికత ఎంతగా మారుతున్నా, మనిషి తన అంతర్గత స్పష్టతను కోల్పోకూడదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్లో జరిగిన ‘IIT2026 గ్లోబల్ కాన్ఫరెన్స్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐఐటీల 75 ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సుమారు 2,500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, మేధావులను ఉద్దేశించి సద్గురు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన భారతదేశాన్ని కేవలం ఒక ఆధునిక దేశంగా కాకుండా, ఒక ప్రాచీన నాగరికతగా గుర్తించాలని కోరారు. “భారతదేశానికి వేల ఏళ్ల నాగరికత ఉంది. ఇక్కడ కేవలం బాహ్య ప్రపంచం గురించే కాకుండా, మనిషి అంతర్గత ప్రపంచం గురించి కూడా లోతైన పరిశోధనలు జరిగాయి. మన నాగరికతలో ఉన్న మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మరెక్కడా కనిపించదు” అని సద్గురు అభిప్రాయపడ్డారు. నేటి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ ప్రాచీన వారసత్వం ఎంతో కీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతున్న ఈ కాలంలో, డేటాను ప్రాసెస్ చేయడంలో యంత్రాలు మనిషిని మించిపోవచ్చని, కానీ మనిషి తనలోని లోతైన మేధస్సును మేల్కొల్పాలని సూచించారు. “ఈ భూమిపై అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ‘మానవ తంత్రం’. ఈ అంతర్గత సాంకేతికతను మనం సరిగ్గా వినియోగించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు అనేది కేవలం టెక్నాలజీతో మాత్రమే కాకుండా, మనిషిలో ఉండే సమతుల్యత, స్పృహతోనే ఆకృతి చెందుతుందని సద్గురు తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఐఐటీయన్ల ప్రతిభకు సద్గురు ఆధ్యాత్మిక చింతన తోడైతే సమాజంలో గొప్ప మార్పులు సాధ్యమవుతాయని ఈ సదస్సు చాటిచెప్పింది.
Those who are at the cutting edge of technology and external wellbeing, if we want to ride on the successes we have created, investing in inner wellbeing is no more a spiritual aspiration but a basic requirement to remain effective in just about anything we do. -Sg#IIT2026 pic.twitter.com/w5fgz6GnMQ
— Sadhguru (@SadhguruJV) April 24, 2026