Reading Time: 2 minutes
Cjp Calls Off September 5 Delhi Protest After Sc Quashes Neet Firs

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీతో పాటు బీజేపీ పాలిత నాలుగు రాష్ట్రాల పోలీసులు ఇకపై నీట్ ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించబోమని.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ తెలిపింది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ పోలీసులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 5న చేపట్టాల్సిన నిరసన పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అసోం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు కీలక హామీలు ఇచ్చారు. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించబోమని.. ఆ కేసుల్లో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని తెలిపారు. అలాగే నిరసనలకు సంబంధించి ఇకపై కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. నిరసనకారులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని తుషార్ మెహతా తెలిపారు. ఈ చర్చల అనంతరం పలు అంశాలపై అవగాహన కుదిరిందన్నారు. నిరసనల సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తెలిపారు.

ఆర్టికల్ 142తో ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేత

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కొట్టివేయాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. “పూర్తి న్యాయం చేసేందుకు ఆర్టికల్ 142ను ఉపయోగిస్తున్నాం. నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేస్తున్నాం” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న వారిపై మాత్రం కేసులు కొనసాగుతాయని పేర్కొంది.

సెప్టెంబర్ 5 నిరసనకు CJP పిలుపు

గత నెలలో సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో దేశవ్యాప్త నిరసన మార్చ్ నిర్వహించాలని సీజేపీ ప్రకటించింది. జూలై 25న ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ పిలుపునిచ్చింది. జూలై 25 తర్వాత దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలను ఉపసంహరించుకున్నప్పటికీ.. కేంద్రం హామీలను నెరవేర్చలేదని పేర్కొంటూ మళ్లీ ఆందోళనకు సిద్ధమైంది. సీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మృతుల కుటుంబాలకు పరిహారం

నీట్ పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడి మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిహారం అందించే విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నందున ఈ పరిహారం ఒక సాధారణ నిబంధనగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరిపి పరిహార పథకాన్ని ఖరారు చేసేందుకు మూడు నెలల సమయం అవసరమని కోర్టుకు తెలిపారు. విధివిధానాలు ఖరారైన వెంటనే పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల కేసుల్లో వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందించే అంశంపై మూడు నెలల్లో విధివిధానాలను ఖరారు చేసి, అనంతరం చెల్లింపులు చేపట్టాలని సీజేఐ సూర్యకాంత్ సూచించారు.