
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణ్యక్షేత్రాలను సందర్శించి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు నిర్మల్ జిల్లా కుబీర్ వాసులుగా గుర్తించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు జీపులో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలో జీపు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.