
- 152 మీటర్ల ఎత్తుకు అనుమతించాలని
- కోరుతున్న తెలంగాణ
- గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపునకు యోచన
- ఇప్పటికే అధికారులకు సీఎం దిశా నిర్దేశం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక చర్చకు వేళైంది. మంగళవారం ఢిల్లీ వేదికగా తెలంగాణ, మహారాష్ట్రతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలతో ఈ భేటీ జరగనుంది. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి, గ్రావిటీ ద్వారానే 80 టీఎంసీల నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించాలని తెలంగాణ యోచిస్తున్నది.
ఇందుకోసం ఇప్పటికే పూర్తిస్థాయి టెక్నికల్ రిపోర్టులను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఈ సమావేశంలో చర్చకు పెట్టనుంది. కాగా, ఆ ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా..? ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోకుంటే.. 150 మీటర్ల ఎత్తుతోనైనా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎత్తు.. ముంపుపైనే అభ్యంతరం..
గతంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు హెడ్వర్క్స్ను తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో తలపెట్టారు. కానీ ఆ ఎత్తుతో మహారాష్ట్రలో అటవీ భూమితోపాటు చాప్రాల వైల్డ్ లైఫ్ సాంక్చువరీ మునుగుతుందని మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో 148 మీటర్ల ఎత్తుకు ఒప్పందం జరిగింది.
ఆ తర్వాత ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్ పేరిట కేసీఆర్ కాళేశ్వరం నిర్మించడంతో అది అటకెక్కింది. ఇప్పుడు కాళేశ్వరం కుంగడం.. రాష్ట్రానికి నీటి వనరు కావాల్సి ఉండడంతో ప్రభుత్వం మళ్లీ తుమ్మడిహెట్టి ప్రాజెక్టును చేపడుతోంది. ఇందులో భాగంగానే అన్ని అధ్యయనాలతో ముందుకు వెళ్తోంది. పుణెలోని ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ముంపుపై సమగ్ర సాంకేతిక అధ్యయనం నిర్వహించింది. బ్యారేజీ ఎత్తు 148 మీటర్లు ఉంచినా మహారాష్ట్ర పరిధిలో సుమారు 1,150 ఎకరాలు ముంపునకు గురవుతాయని పేర్కొంది. ఎత్తును 152 మీటర్లకు పెంచితే మహారాష్ట్రలో ముంపు విస్తీర్ణం 2,500 ఎకరాల వరకు ఉంటుందని పేర్కొంది. సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ప్రకారం ముంపునకు గురయ్యే 2,500 ఎకరాల్లో 50 శాతం కంటే ఎక్కువ భూమి నదీ గర్భంలోనే ఉంటుందని స్పష్టం చేసింది.