Reading Time: 2 minutes
MS Dhoni: సీఎస్కే ఫ్యాన్సుకు బిగ్ అప్‌డేట్.. ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త అవతారం

MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సీజన్లో ధోనీ ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెడతాడా అనేది అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై తలుపులు తెరిచే ఉంచినప్పటికీ ఆయన ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని సమాచారం. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. గడిచిన 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, డగౌట్ నుంచి తన జట్టు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. రోజూవారీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఒక కారణం. ఈ క్రమంలో సీఎస్కే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి మెంటార్ హోదా ఇచ్చే ఆలోచనలో ఉంది.

18 ఏళ్ల ఫ్లెమింగ్ ప్రయాణానికి ముగింపు

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జూలై 2026లోనే జట్టు నుంచి తప్పుకున్నారు. 2009 నుంచి సుదీర్ఘకాలం పనిచేసిన ఫ్లెమింగ్ ఇప్పుడు ఇంగ్లండ్ రెడ్ బాల్ టీమ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో సీఎస్కే కొత్త హెడ్ కోచ్ కోసం వెతుకుతోంది. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. స్థానిక తమిళనాడు క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కోచింగ్ అనుభవం ఉండటంతో ఆయన వైపు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ధోనీ మెంటార్‌గా మారినా కొత్త హెడ్ కోచ్ నియామకం తప్పనిసరి కానుంది.

ఫ్రాంచైజీలో వాటా వార్తలు ఉట్టి పుకార్లే

గత కొన్ని రోజులుగా ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో వాటా కోరారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మొదట 25 శాతం, ఆపై 18 శాతానికి అంగీకరించారని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ పుకార్లపై సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ధోనీ వాటా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అధార రహితమైనవని స్పష్టం చేశారు. ధోనీ నిర్ణయానికే సీఎస్కే యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు. ధోనీ మైదానంలో బ్యాట్ పట్టి సిక్సర్లు బాదుతాడా లేక మెంటార్‌గా డగౌట్ నుంచి వ్యూహాలు రచిస్తాడా అనేది త్వరలోనే తేలనుంది. ఏ పాత్రలో ఉన్నా సీఎస్కే అభిమానులకు ధోనీ ఉనికి ప్రత్యేకమైన ఆనందాన్నే అందిస్తుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..