Reading Time: < 1 minute
Netanyahu Orders Israel Military Control 70 Percent Gaza

Gaza War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌లోని 70 శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గాజాలోని అధిక భూభాగం సైనిక నియంత్రణలోకి తీసుకునే ప్లాన్‌ను నెతన్యాహూ ప్రకటించారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దళాలు తమ పట్టును క్రమంగా పెంచుకుంటున్నాయని, హమాస్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంటాయని అన్నారు.

‘‘మేము ఇప్పుడు గాజా స్ట్రిప్‌ను 60 శాతం నియంత్రిస్తున్నాము. గతంలో 50 శాతం ఉండేది, దశల వారీగా ముందుకు వెళ్తూ 70 శాతాన్ని ఆధీనంలోకి తీసుకుంటాము’’ అని నెతన్యాహూ అన్నారు. అక్టోబర్ 07, 2024 దాడుల తర్వాత గాజాలోని హమాస్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ సర్వనాశనమైంది. ఇజ్రాయిల్ సైన్యం అంతర్జాతీయ సంస్థలకు ఏప్రిల్‌లో అందించిన మ్యాపుల ప్రకారం.. గాజాలో 64 శాతం ప్రాంతం ఇజ్రాయిల్ కంట్రోల్‌లో ఉంది. ఇప్పుడు దీనిని 70 శాతానికి పెంచితే మరో 20 లక్షల మందిని తరలించాల్సి ఉంటుంది.

2025 అక్టోబర్‌లో ఇజ్రాయిల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయిల్ సైన్యం ‘‘ఎల్లో లైన్’’ అనే సరిహద్దు వరకు వెనక్కి వెళ్లింది. ఈ ప్రాంతం గాజాలో సుమారు 53 శాతం వరకు ఉండేది. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్ ఈ సరిహద్దును మరింత లోపలికి నెట్టిందని హమాస్ ఆరోపిస్తోంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు లెబనాన్‌లోని హిజ్బొల్లాపై కూడా ఇజ్రాయిల్ దాడుల్ని పెంచింది.