Reading Time: 2 minutes
Pm Modi Calls Gulf Leaders

అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్‌ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. పెద్ద ఎత్తున బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు మిత్రదేశాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతు తెలిపగా.. తాజాగా భారత ప్రధాని మోడీ కూడా మద్దతు తెలిపారు. సౌదీ యువరాజు, బహ్రెయిన్ రాజుతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాలపై జరిగిన దాడులను ఖండించారు.

ఇది కూడా చదవండి: Iran War: గల్ఫ్ దేశాల్లో భారతీయులకు అష్టకష్టాలు.. 3 రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లుగా మోడీ ఎక్స్‌లో తెలిపారు. ‘‘సౌదీ అరేబియాపై జరిగిన దాడులను భారతదేశం ఖండించింది. ఇది సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైందిగా భావించాం. ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ సమాజ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకున్నందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను.’’ అని రాసుకొచ్చారు.

అలాగే బహ్రెయిన్ రాజు మాన్య రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా ఫోన్ సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. ‘‘బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో బహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి అందించిన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’’ అని మోడీ పేర్కొన్నారు.