Reading Time: < 1 minute

అమరావతి: రాయలసీమ హక్కుల పేరుతో వైసిపి మభ్య పెడుతోందని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2014-19లో టిడిపి రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని, వైసిపి కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలియజేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేశారని, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఎకరాకు నీరందించడం లక్ష్యం అని మండిపల్లి పేర్కొన్నారు. గాలేరు, నగరి సుజల స్రవంతి పూర్తి ప్రభుత్వ ప్రాధాన్యం అని.. రాయలసీమ ప్రాజెక్టులకు రూ.6,613 కోట్లు కేటాయింపు జరిగిందని అన్నారు. హంద్రీనీవా ద్వారా 738 కి.మీ. దూరంలోని కుప్పానికి నీరు తరలిస్తామని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.205 కోట్లు కేటాయింపు జరిగిందని అన్నారు. విమర్శ రాజకీయాలకంటే అభివృద్ధి రాజకీయాలే తమకు ముఖ్యమని మండిపల్లి స్పష్టం చేశారు.