Reading Time: < 1 minute
Peddi Ticket Price Hike Unlikely In Telangana As Movie Team Withdraws High Court Petition

Peddi Ticket Price Hike: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణాలో టికెట్ ధరల పెంపు వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సినిమా విడుదల సందర్భంగా వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ‘పెద్ది’ సినిమా యూనిట్.. చివరకు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు హోం సెక్రటరీకి రెండు సార్లు వినతిపత్రాలు కూడా సమర్పించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

కానీ టికెట్ ధరల పెంపు వ్యవహారంపై గతంలో ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకున్న హైకోర్టు.. ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో పరిస్థితిని అంచనా వేసుకున్న ‘పెద్ది’ సినిమా యూనిట్.. తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణాలో ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరలు పెరిగే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో ఏమైనా ప్రత్యేక అనుమతులు వస్తాయా లేదా అన్నది చూడాలి. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.