
పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్య్సకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ మృతి చెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), పొంగి బబులు(10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.