Reading Time: < 1 minute
BCCI vs BCB: సిగ్గు చేటు.. భారత్‌కు అనుకూలంగా ఐసీసీ వైఖరి.. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ విమర్శలు

ICC vs BCB, Shahid Afridi: భారత, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అలజరడి సృష్టిస్తోంది. బీసీసీఐ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి బహిష్కరించిన తర్వాత, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. భారతదేశంలో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని, మ్యాచ్‌ల వేదికలను భారత మైదానాల నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి ఇమెయిల్ పంపింది. అయితే, ఇప్పుడు ఐసీసీ తన డిమాండ్‌ను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ నిర్ణయం తర్వాత పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచాడు.

ఐసీసీ వైఖరిపై అఫ్రిది విమర్శలు..

ఈ విషయంపై పాకిస్తాన్‌లోని సామ్ టీవీలో షాహిద్ అఫ్రిది తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఐసీసీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించాడు. దాని ఆలోచన, వైఖరిని మార్చుకోవాలని కోరాడు. భారతదేశం, బంగ్లాదేశ్, ఐసీసీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి షాహిద్ అఫ్రిది అసలేమన్నారో ఓసారి చూద్దాం..

షాహిద్ అఫ్రిది ఏం చెప్పాడంటే?

పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న భారతదేశం-బంగ్లాదేశ్ వివాదంలో ఐసీసీ పాత్ర ప్రపంచ క్రికెట్‌కు అవమానం. ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో అన్ని దేశాలు భారతదేశం నుంచి తమను తాము దూరం చేసుకుంటాయని ఆయన అన్నాడు. ఐసీసీ ఎల్లప్పుడూ భారతదేశం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని షాహిద్ అఫ్రిది తెలిపాడు. దీనిని మార్చాలి, ఆపాలి అంటూ చెప్పుకొచ్చాడు.

2026 టీ20 ప్రపంచ కప్ భారతదేశం, శ్రీలంకలో జరగనుంది. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచ్‌లన్నింటినీ భారతదేశంలో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..