
చెన్నై: తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే.. మహిళలందరికీ నెలకు రూ. 2,000 చొప్పున సహాయం అందిస్తామని.. ఉచిత ఎల్పీజి సిలిండర్లు ఇస్తామని బిజెపి ప్రకటించింది. మంగళవారం చెన్నైలో బిజెపి నాయకుడు జేపీ నడ్డా.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ నాయకులు కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ సహా పార్టీకి చెందిన ఇతర కీలక నాయకులు కూడా పాల్గొన్నారు.
బీజేపీ మేనిఫెస్టోలోని కీలక హామీలు
1. మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 2,000 సహాయం
2. ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000 ఆర్థిక సహాయం
3. గృహాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు
4. జీరో ఎఫ్ఐఆర్ రిపోర్టింగ్ విధానం ప్రారంభం
5.ఘోరమైన నేరాల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు
6. బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని అంధ ప్రదేశాలను (బ్లైండ్ స్పాట్స్) తొలగించడానికి సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
7. అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్లు కొనుగోలు చేయడానికి రూ. 25,000 సహాయం
8. స్వయం సహాయక బృందాలు మరియు ఎంఎస్ఎంఈలకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
9. రైతులకు అదనంగా రూ. 3,000 సహాయం (కేంద్ర పథకంతో కలిపి మొత్తం రూ. 9,000)
10. జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం.
11. జల్లికట్టు కార్యక్రమాల సమయంలో ఎవరైనా పాల్గొనేవారు మరణిస్తే, రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా పరిహారం.
12. ఇళ్లు కొనుగోలు చేసే మహిళలకు 3 శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ.
కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.