Reading Time: 2 minutes

 బిహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి ముఖ్యమంత్రిని మంగళవారం ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడించారు. అధికార బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్ పట్నాకు రానున్నట్లు సమాచారం. నూతన శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర పరిశీలకుడిగా నియమితులైన చౌహాన్, రాష్ట్ర పర్యటనకు రానున్న రోజు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, ఉదయం 11 గంటలకు జరగనున్న చివరి కేబినెట్ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలసి రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. బీజేపీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సారోగి మాట్లాడుతూ, శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు పట్నాకు వస్తారు. ఆయన సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు అని తెలిపారు. అయితే, అధికార మార్పిడి నేపథ్యంలో పార్టీ నేతలు జాగ్రత్తగా స్పందిస్తున్నారు.

మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇది భావోద్వేగ క్షణం. నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. 243 సభ్యుల బిహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 202 సీట్లతో ఘన మెజారిటీ ఉంది. ఇందులో బీజేపీకి 89 సీట్లు ఉండగా, జేడీయూకు 85 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లను చిన్న మిత్రపక్షాలు ఆక్రమించాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌చౌదరి పేరు ముందంజలో ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన గతంలో ఆర్జేడీ, జేడీయూ పార్టీల్లో పని చేసిన నేపథ్యాన్ని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ముఖ్యమంత్రి ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందినవారే అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. బిహార్ రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మరోవైపు, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇటీవలే జేడీయూలో చేరిన ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని కొందరు భావిస్తుండగా, అనుభవం సంపాదించిన తరువాతే పెద్ద బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఇక నితీష్ కుమార్ కుటుంబం అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని సమన్వయంగా స్వీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అధికార నివాసమైన అన్నే మార్గ్ నుంచి వారి సామగ్రి తరలింపు జరుగుతుండగా, త్వరలోనే ఆ నివాసంలో కొత్త ముఖ్యమంత్రి ప్రవేశించనున్నారు.