
IPL 2026 Record : క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటే ఇదే అనిపించేలా ఐపీఎల్ 2026 సీజన్లో ఏప్రిల్ 25 చరిత్రలో నిలిచిపోయింది. ఒకే రోజు జరిగిన రెండు మ్యాచ్ల్లో పరుగుల వర్షం కురిసి, బౌలర్లకు అసలు ఛాన్స్ లేకుండా పోయింది. ఫ్యాన్స్కు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందింది. సిక్సర్లు, సెంచరీలు, రికార్డులు అన్నీ ఒకే రోజులో చూసే అదృష్టం దక్కింది. ఆ ఒక్కరోజే పరుగుల సునామీ సృష్టించిన విధ్వంసానికి రికార్డులన్నీ గాలిలో కలిసిపోయాయి. నాలుగు జట్లు, రెండు మ్యాచ్లు.. కానీ ఫలితం మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే గణాంకాలు. ఆ ఒక్కరోజే ఏకంగా 986 పరుగులు నమోదయ్యాయి అంటే బ్యాటర్లు బౌలర్లను ఏ రేంజ్లో ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కరోజే 986 పరుగులు – ఆల్టైమ్ రికార్డ్
ఏప్రిల్ 25, 2026న జరిగిన రెండు మ్యాచ్ల్లో (ఢిల్లీ vs పంజాబ్, రాజస్థాన్ vs హైదరాబాద్) కలిపి మొత్తం 986 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని పరుగులు రావడం ఇదే మొదటి సారి. గతంలో 2024లో నమోదైన 899 పరుగుల రికార్డు ఇప్పుడు కనుమరుగైపోయింది. 900 మార్కును దాటడమే కష్టం అనుకుంటే, ఏకంగా వెయ్యి పరుగుల దరిదాపుల్లోకి చేరి బ్యాటర్లు తమ ప్రతాపం చూపారు. నాలుగు జట్లు కలిసి బాదిన 59 సిక్సర్లు ఈ మ్యాచ్ల తీవ్రతను చెబుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డ్ రన్ ఛేజ్
పంజాబ్ కింగ్స్ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు కూడా పంజాబ్ పేరిటే (262 రన్స్) ఈ రికార్డు ఉండటం విశేషం. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా రాజస్థాన్పై 229 పరుగులను ఛేజ్ చేసి, ఐపీఎల్ టాప్-5 రన్ ఛేజ్ల జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
కేఎల్ రాహుల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్పై 152 పరుగులతో నాటౌట్గా నిలిచి, ఐపీఎల్లో 150 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడినా, తన జట్టు ఓడిపోవడంతో రాహుల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత క్రికెటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పుడు రాహుల్ పేరిట ఉంది.
చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇందులో 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇది అతనికి ఐపీఎల్లో రెండో సెంచరీ కావడం విశేషం. కేఎల్ రాహుల్ లాగే వైభవ్ శ్రమ కూడా వృథా అయ్యింది. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత పోరాటంతో రాజస్థాన్ను ఓడించింది. ఇద్దరు సెంచరీ వీరులు ఒకే రోజు ఓటమి పాలుకావడం క్రికెట్ అభిమానులను కలచివేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి