Reading Time: 2 minutes
Hyderabad Senior Citizen Scammed 24 Lakhs Investment App Fraud Gopanpalli

Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్‌గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్ కట్ చేస్తే భారీ సైబర్ మోసం బయటపడుతుంది. వృద్ధులు.. అమాయకులే సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ 80 ఏళ్ల వృద్ధున్ని నమ్మించి ఏకంగా 24 లక్షల రూపాయలు కొట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

READ ALSO: Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

పెట్టుబడుల పేరిట హైదరాబాద్ గోపన్‌పల్లిలో ఉంటున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అతన్ని మోసం చేసి లక్షల రూపాయలు కొట్టేసి చెక్కేశారు. తొలుత వృద్ధుడి ఫోన్‌కు రిధివెలే అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. అవతల అమ్మాయి అని తెలియగానే.. వృద్ధుడు కాస్తా బెండ్ అయ్యాడు. ఆ మాటా ఈ మాటా చెప్పి బుట్టలో పెట్టేసింది మాయలేడీ. క్రమక్రమంగా ముగ్గులోకి దించి.. కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అలాంటి యాప్స్ మన దగ్గర ఉన్నాయని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మాడు ఆ అమాయక వృద్ధుడు. గుడ్డిగా ఆమె చెప్పిన యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.

ప్రతి రోజూ మాటల్లో పెడుతూ.. పెట్టుబడులు పెట్టించింది మాయ లేడీ. కొంతకాలం భారీ లాభాలు వచ్చినట్లు బాధితుడికి తప్పుడు సమాచారం కూడా ఇచ్చింది. పైగా వృద్ధుడి అకౌంట్లో భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షల 77వేల 040 ఉన్నట్లు చూపించింది. ఇక అక్కడి నుంచి మరో కథ షురూ చేసింది. ఆ డబ్బు విడుదల చేయాలంటే ముందుగా ‘కన్వర్షన్‌ ఫీ’ చెల్లించాలని చెప్పింది. ఆ మాయలేడీ మాటలు ఇంకా నమ్మిన బాధితుడు.. వివిధ బ్యాంక్‌ ఖాతాలకు మొత్తంగా రూ.24 లక్షల 38 వేల 483 ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అప్పటికీ మాయలేడీ దాహం తీరలేదు. మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో మోసం జరిగినట్లు గ్రహించాడు వృద్ధుడు. గట్టిగా నిలదీయడంతో అవతలిపక్క నుంచి ఫోన్ కట్ అయింది. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?