మత్తు కోసం మనుషులు ఏ స్థాయికి దిగజారుతారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో యువత ‘బ్లడ్ కిక్’ అనే వింత వ్యసనానికి బానిసలవుతున్నారు. వాళ్ళు తమ సొంత రక్తాన్ని తామే సిరంజీలతో బయటకు తీసి, తిరిగి వాళ్లే ఎక్కించుకుంటున్నారు. వినడానికి ఒళ్లు గగుర్పొడిచే ఈ పని వెనుక ఉన్న ప్రమాదాలు ఏంటి? అస్సలు యువత ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే షాకింగ్ నిజాలు తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో భోపాల్లో ఇలాంటి వింత కేసులు వెలుగులోకి వచ్చాయి. రక్తాన్ని బయటకు తీసి మళ్లీ ఎక్కించుకోవడం వల్ల మెదడులో ఏదో తెలియని ‘మత్తు’ లేదా ‘కిక్’ వస్తుందని యువత భ్రమపడుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో చాలా ప్రమాదకరమైన అలవాటుగా గుర్తించారు. కేవలం తాత్కాలిక సంతోషం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సొంత రక్తాన్నే కదా ఎక్కించుకుంటున్నాం అనుకుంటే మనకు ఏమి కాదులే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రక్తాన్ని బయటకు తీసినప్పుడు అది గాలిలోని బ్యాక్టీరియాతో కలిసే అవకాశం ఉంటుంది. మళ్లీ దానిని ఎక్కించుకోవడం వల్ల రక్తం విషపూరితం అయి హెపటైటిస్,ఇంఫెక్షన్ వంటి భయంకరమైన వ్యాధులు సోకుతాయి. ఇది నేరుగా మరణానికి దారితీసే అవకాశం ఉంది.

ఇలా రక్తాన్ని పదే పదే ఎక్కించుకోవడం వల్ల నరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇంజెక్ట్ చేసే సమయంలో రక్తం గడ్డకడితే, అది నేరుగా ఊపిరితిత్తులకు లేదా గుండెకు చేరి ప్రాణాపాయం కలిగిస్తుంది. అలాగే వాడిన సిరంజీలనే మళ్లీ వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తాయి.
ఇలాంటి పనులు చేసే వారు ఎక్కువగా డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. తమను తాము గాయపరుచుకోవడంలో ఆనందాన్ని వెతుక్కునే ‘సెల్ఫ్ హార్మ్’ ప్రవృత్తి వీరిలో కనిపిస్తుంది. ఒంటరిగా ఉండటం, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉంటే వారు ప్రమాదంలో ఉన్నారని గుర్తించాలి.
మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే గమనించండి. వారి చేతులపై సూది గుర్తులు ఉన్నాయా? లేదా వారు తరచుగా గదిలో ఒంటరిగా గడుపుతున్నారా? అనేది చూడాలి. ఇలాంటి వ్యసనాల బారిన పడిన వారికి కేవలం మందులే కాదు, మంచి కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల తోడు చాలా అవసరం.
The post షాకింగ్ వ్యసనం… సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేస్తున్న యువత appeared first on Manalokam – Latest Telugu News & Updates.