
రాగి, ఇత్తడి వంటి సంబంధిత వస్తువులు, పరికరాలు ప్రతి ఇంటి అవసరాల్లో ప్రధాన భాగంగా మారాయి. ఇంటి అందాన్నిపెంచుకోవడానికి చాలా మంది రాగి పాత్రలు, ఎయిర్ కండిషనర్, ఫ్యాన్సీ బాత్వేర్ కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇది మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. మీరు మునుపటి కంటే ఎక్కువ ధరలు చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే.. రాగి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది రాగి ఉత్పత్తులను, ముఖ్యంగా గృహోపకరణాలను ప్రభావితం చేస్తోంది. మన్నికైన వస్తువులు, వంట సామాగ్రి, బాత్వేర్లను తయారు చేసే కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ధరలను పెంచే అవకాశం ఉంది.
నివేదిక ప్రకారం రాగి ధరలు గత నెలలో రికార్డు స్థాయిలో టన్నుకు $12,000 కు చేరుకున్నాయి. ఇది 2009 తర్వాత అతిపెద్ద వార్షిక పెరుగుదలను సూచిస్తుంది. చాలా కంపెనీలు దిగుమతులు, స్థానిక సోర్సింగ్ మిశ్రమం ద్వారా రాగిని కొనుగోలు చేస్తాయి. ప్రపంచ ధరలలో హెచ్చుతగ్గులు మొత్తం ధరలను ప్రభావితం చేస్తాయి. AC కేటగిరీకి ఇన్పుట్ ఖర్చులపై మొత్తం ప్రభావం 8-10శాతం పెరిగింది. ప్రస్తుతం, కొత్తగా తయారు చేయబడిన అన్ని ACలు రాగి ధరతో పాటు శక్తి పట్టిక మార్పుల ధరతో ప్రభావితమవుతాయి. దీని వలన AC ధరలు 7-8శాతం పెరుగుతాయని అంచనా.
2025లో భారీగా పెరిగిన మెటల్ ధరలు 2026 మొదట్లో కూడా బలంగా ఉన్నాయి. MCXలో కాపర్ ధర రూ.1,270-1,300( 1 kg) ల దగ్గరగా ఉంది. 2025లో 42-48శాతం పెరిగింది. గత శుక్రవారం జనవరి 3 వరకు రాగి ధరలు కిలోగ్రాముకు దాదాపు రూ.1,300కి చేరుకున్నాయి. ఇది 6శాతం కంటే ఎక్కువ పెరుగుదల. అటు, ఇత్తడి ధరలు కూడా 15-18శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. కంపెనీలు అధిక ఖర్చులను భరించలేవు. అప్పుడు వినియోగదారులపై ప్రభావం పడుతుంది. గత సంవత్సరం, వడ్డీ రేట్లు తగ్గడం, డాలర్ బలహీనపడటం, చైనా ఆర్థిక వృద్ధి అంచనాలు మెరుగుపడటంతో రాగి, అల్యూమినియం, లిథియం వంటి ఇతర పారిశ్రామిక లోహాల ధరలు పెరిగాయి. సరఫరా అంతరాయాలు, విధాన మార్పులు, AI పై భారీ వ్యయం కూడా ధరలను పెంచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..