Reading Time: < 1 minute
Supreme Court Unhappy With Ncert Class 8 Textbook Content On Alleged Judicial Corruption

8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం చేర్చడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే కంటెంట్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. సుమోటో కాగ్నిజెన్స్ చేయాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠ్యాంశం తీరుపై న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పారు. సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం సూచించింది.

వివాదం ఏంటంటే..
NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఒక అధ్యాయంలో ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠ్యాంశం ఉంది. పిల్లలకు ఇలాంటి పాఠాలు ఎలా నేర్పిస్తారంటూ సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించింది.

గతేడాది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున నగదు లభించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. న్యాయమూర్తులు ఈ స్థాయిలో దోపిడీ చేస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ పాఠ్యాంశంగా రావడం విశేషం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.