Reading Time: 2 minutes

హైదరాబాద్: మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ల రెండు అంశాలను బిజెపి కలిపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన డీ-లిమిటేషన్‌పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలక అంశాలు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి దుష్ప్రచారం చేస్తోంది. మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్. మొదట ఓటు హక్కు, తర్వాత రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించింది’’ అని అన్నారు.

రాజ్యంగబద్ధ పదవులను కూడా మహిళలకు ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని సిఎం అన్నారు. ‘‘స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును 2013లోనే సోనియా గాంధీ ప్రవేశపెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయాలని ఎన్డిఎ చూస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్లను చేయాలనేది మా డిమాండ్. ఈ రెండింటిని కలపటం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉంది. 33 శాతం మహిళ రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మహిళ రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం’’ అని సిఎం పేర్కొన్నారు.

నాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని సిఎం అన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెప్తున్నారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు భారీగా పెరగనున్నాయి. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుంది. సీట్ల పెంచు తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 195 అవుతాయి. సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో సీట్లు 620కి పెరుగుతాయి. ఉత్తర, దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కు పెరుగుతుంది’’ అని సిఎం తెలిపారు.

ఎన్డిఎ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని సిఎం ధ్వజమెత్తారు. ‘‘కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వటం లేదు. సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు. 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెంచుతుంది. దక్షిణాదిపై చూపుతున్న వివక్షతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళ్తోంది. మహిళ బిల్లును అడ్డుపెట్టుకుని డీ లిమిటేషన్ చేయొద్దు. ప్రస్తుత సీట్ల ప్రకారమే చట్ట ప్రకారమే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి’’ అని సిఎం స్పష్టం చేశారు.