
తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. అవును మిస్టర్ పవన్.. తెలంగాణ మా జాగీరే 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగీరే అని సమాధానం చెప్పారు. ఏపీలో ఏం పీకావు.. తెలంగాణలో ఏం పీకుతావు..? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తోందని అన్నారు. తెలంగాణకు మద్ధతుగా ఎప్పుడైనా పవన్ మాట్లాడారా..? అమరవీరుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు మంత్రి. తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకు..ఏపీలో ఏం పీకావు.. ఇక్కడ ఏం పీకుతావు..? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పవన్ ను ఎంగేజ్ చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికితే ఊరుకోమని హెచ్చరించారు. అనవసరంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు.
- మూడు సినిమాలు ఫ్లాప్ అయినందుకే ఈ డిప్రెషన్: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించిన అనిరుధ్.. మూడు సినిమాలు ఫ్లాప్ అయినందుకే పవన్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వాళ్ల దగ్గరికి వెళ్తావు.. ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్ ఫ్లాప్ అయ్యాయి.. ఆ డిప్రెషన్లోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు అని అన్నారు -అనిరుధ్రెడ్డి.
కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం అయినప్పుడుఎక్కడికి పోయావ్ పవన్ అని ప్రశ్నించారు అనిరుధ్. వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో దాక్కున్నారు అని విమర్శించారు. సినిమా టికెట్లు పెంచాలని ఎందుకు అడుక్కుంటున్నారు అని ప్రశ్నించారు.
అమిత్షాపై ప్రేముంటే గుజరాత్లో పోటీచేయి.. డిప్యూటీ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావు.. తెలంగాణ నరదిష్టి అని ఇందుకోసమే మాట్లాడారు కావొచ్చు.. మొన్న మోడీ వస్తే నిన్ను అమరావతిలో కలిశారా? హైదరాబాద్లో కలిశారా? తిరుపతికి వెళ్లి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా చెప్పుకుంటామా? అంటూ విమర్శించారు.