Reading Time: < 1 minute
Rbi Directs Banks To Remove Hidden Charges And Dark Patterns From Mobile Apps By July 2026

No More Hidden Charges: బ్యాంకు కస్టమర్ల రక్షణకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే “డార్క్ ప్యాటర్న్” ఐడియాలను తొలగించాలని బ్యాంకులకు ఆదేశించింది. ఈ మార్పులను అమలు చేయడానికి జూలై 2026 వరకు గడువు ఇచ్చింది. ఆర్బీఐ జారీ చేసిన బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన సవరణ ఆదేశాలు, 2026’ ముసాయిదా ప్రకారం, బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ యాప్‌లలో వినియోగదారులను గందరగోళానికి గురిచేసే లేదా ఒత్తిడి చేసే డిజైన్ విధానాలను పూర్తిగా తొలగించాలి. ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను అందించే ముందు కస్టమర్ల నుండి స్పష్టమైన సమ్మతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది..

కస్టమర్‌కు తెలియకుండా అదనపు సేవలను జోడించడం, చెక్‌అవుట్ సమయంలో దాచిన ఛార్జీలు చూపించడం, పదేపదే నోటిఫికేషన్‌లతో ఒత్తిడి చేయడం వంటి చర్యలు ఇకపై అనుమతించబడవు. కస్టమర్ స్పష్టమైన అనుమతి లేకుండా ఉత్పత్తులను ‘బండిల్’ చేసి విక్రయించడం కూడా నిషేధించబడుతుందని పేర్కొంది ఆర్బీఐ..

డార్క్ ప్యాటర్న్‌లు అంటే ఏమిటి?
డార్క్ ప్యాటర్న్‌లు అనేవి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించే డిజైన్ సాంకేతిక పద్ధతులు. వీటి ఉద్దేశ్యం వినియోగదారుడి నిర్ణయాలను ప్రభావితం చేసి, అతను పూర్తిగా అర్థం చేసుకోకుండానే సేవలు లేదా ఉత్పత్తులను ఎంచుకునేలా చేయడం. ఉదాహరణకు.. ముందుగా టిక్ పెట్టిన ఎంపికలు.. చివరి దశలో మాత్రమే కనిపించే అదనపు రుసుములు.. ఇలా గందరగోళపరిచే ఆప్షన్స్‌.. పదేపదే వచ్చే రివార్డ్స్‌ సందేశాలు.. ఇలాంటి విధానాలు పారదర్శకతకు విరుద్ధమని ఆర్బీఐ స్పష్టం చేసింది.

సర్వే తరువాత కఠిన నిర్ణయం
మీడియా నివేదికల ప్రకారం, లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 388 జిల్లాల్లో 1.61 లక్షలకుపైగా మంది స్పందించారు. ఈ సర్వేలో అనేక ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో దాచిన ఛార్జీలు, గందరగోళపరిచే ఎంపికలు సాధారణంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. బ్యాంకులు జూలై 2026 నాటికి అన్ని డార్క్ ప్యాటర్న్‌లను పూర్తిగా తొలగించి, కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలి. డిజిటల్ ఆర్థిక సేవలను మరింత సులభం, పారదర్శకం, న్యాయమైనవిగా మార్చడమే లక్ష్యంగా పేర్కొంది ఆర్బీఐ.. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య కస్టమర్లకు పెద్ద ఉపశమనం కలిగించే అవకాశముందని అంచనా వేస్తున్నారు..