Reading Time: < 1 minute
Venezuela Acting President Delcy Rodriguez India Visit June 2026

India-Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. జూన్ 1న జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్ రావాల్సి ఉంది. అయితే, ఈ సదస్సు వాయిదా పడిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. రోడ్రిగ్జ్‌తో పాటు పలువురు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగం కానుంది. ఆమెతో పాటు విదేశాంగ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సమాచార, రవాణా శాఖల మంత్రులతో సహా పలువురు మంత్రులు కూడా ఉంటారని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.

రోడ్రిగ్జ్‌కు భారత్‌తో చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాంగ మంత్రిగా, ఉపాధ్యక్షురాలిగా ఆమె పలుమార్లు భారత్ సందర్శించారు. 2015లో విదేశాంగ మంత్రిగా 2019, 2023, 2024, 2025లలో ఉపాధ్యక్షురాలిగా భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

భారత ప్రభుత్వ రంగ సంస్థలు వెనిజులా ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయని, ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అన్వేషించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని జైస్వాల్ అన్నారు. ఇంధనం, వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు మరింత సహకారాన్ని పెంచుకోనున్నాయి.