Reading Time: < 1 minute
Pm Modi Letter To The People Before The West Bengal Elections

ఈసారి బీజేపీ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు బెంగాలీయులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ హిందీ, బెంగాల్ భాషల్లో లేఖలు రాశారు. లేఖ ప్రారంభంలో కాళీమాతను స్తుతిస్తూ రాశారు.

త్వరలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ లేఖ రాయడం కీలకంగా మారింది. రాబోయే నెలల్లో రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే అధికారం ప్రజలదేనని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి, సంపన్నమైన రాష్ట్రంగా మార్చేందుకు ఇదొక అవకాశం అని.. ఈ అభివృద్ధి ప్రయాణంలో బెంగాలీయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

బెంగాల్ భూమి దేశానికి అనేక మంది గొప్ప వ్యక్తులను అందించిందని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్‌లను ఉదహరించారు. బెంగాల్‌కు కీర్తిని తెచ్చిన గొప్ప వ్యక్తులను, దానికి కొత్త దిశానిర్దేశం చేయవలసిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దార్శనికతను కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. అనేక కేంద్ర పథకాల ప్రయోజనాలు పశ్చిమ బెంగాల్‌లోని లక్షలాది మందికి చేరాయని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, పేదల కోసం ప్రారంభించిన పథకాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ గుర్తుచేశారు.

ఇటీవల కాలంలో రాష్ట్రం వెనుకబడి ఉందని లేఖలో రాశారు. రాజకీయ హింస, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. యువత వలసలు, పెట్టుబడుల కొరత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని మోడీ కోరారు.