Reading Time: < 1 minute
Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్‌కు వచ్చాడు.. తీరా నగలు ఒకసారి పరిశీలించగా

సికింద్రాబాద్‌లోని సింధ్ కాలనీ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో గోల్డ్ లోన్ వ్యవహారం సంచలనంగా మారింది. బ్యాంక్‌లో కుదువపెట్టిన అసలు బంగారు ఆభరణాలు మాయం కావడం, వాటి స్థానంలో నకిలీ నగలు ఉంచారంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది. బాధితుడు కట్టా అనే వ్యక్తి సికింద్రాబాద్‌లోని సింధ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జోసెఫ్ తన వ్యక్తిగత అవసరాల కోసం 2025 జనవరి 29న గోల్డ్ లోన్‌లో తన బంగారు ఆభరణాలను ఇండియన్ బ్యాంక్ సింధ్ కాలనీ బ్రాంచ్‌లో కుదువ పెట్టాడు. మొత్తం 200 గ్రాముల విలువైన ఉంగరాలు, ఇతర బంగారు ఆభరణాలను అప్పు కోసం అప్పగించాడు. లోన్ గడువు పూర్తికాకముందే, 2026 జనవరి 23న మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో నగలను విడిపించుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాడు.

అయితే బ్యాంక్ అధికారులు చూపించిన నగల్లో కేవలం కొన్ని ఉంగరాలు మాత్రమే ఉండగా, మిగతా ఆభరణాలు కనిపించలేదని జోసెఫ్ ఆరోపిస్తున్నారు. మరింత పరిశీలించగా అసలు బంగారం స్థానంలో నకిలీ, కృత్రిమ నగలు పెట్టినట్లు గుర్తించామని చెప్పారు. 20 తులాల బంగారం బ్యాంకులో కుదవపెడితే ఇప్పుడు అంత బంగారం కనిపించడం లేదు. అందులోనూ నకిలీ ఆభరణాలు ఉన్నాయని ఈ విషయంపై బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జోసెఫ్.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌లో జరిగిన ఈ మోసంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన అసలు బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంక్‌లలో గోల్డ్ లోన్ భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ బ్యాంక్ యాజమాన్యం దీనిపై విచారణ చేపట్టింది.