Reading Time: < 1 minute
Imd Rain Alert Heavy Rainfall Warning South India Northeast Monsoon

దేశంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇటీవలే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ ఏడాది 3 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినా.. దేశమంతటా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందుతున్నారు.

కేరళలో రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా నాలుగు నెలల పాటు సాగే వర్షాకాలం ప్రారంభమైంది. రుతుపవనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చేరుకున్నాయి. కేరళ తర్వాత.. మణిపూర్, మిజోరం, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే వారంలో ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘జూన్ 6వ తేదీన నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం మొత్తం, వాయువ్య బంగాళాఖాతం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలతో పాటు మిజోరం, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి.’’అని తెలిపింది. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.