Reading Time: 2 minutes
Abhishek Sharma : టీమిండియా దాచిన పెద్ద నిజం.. గాయాలతోనే అమెరికా, పాక్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్?

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో టీమిండియా శిబిరంలో ఒక కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర గాయంతో బాధపడుతున్నాడన్న విషయాన్ని బీసీసీఐ రహస్యంగా ఉంచిందనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టోర్నీ ఆరంభానికి ముందే అతడికి గాయం అయినప్పటికీ, మేనేజ్మెంట్ ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడిందని, గాయంతోనే అతను మైదానంలోకి దిగాడని సమాచారం. ఇదే అతడి పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. జట్టు అధికారిక ఫోటోషూట్ నిర్వహిస్తున్న సమయంలో అభిషేక్ శర్మ చేతికి తీవ్రమైన గాయమైంది. ఆ గాయం ఎంత లోతుగా ఉందంటే, అతడికి వెంటనే కుట్లు వేయాల్సి వచ్చింది. చేతికి కుట్లు ఉన్నప్పటికీ, దేశం కోసం ఆడే క్రమంలో అభిషేక్ రిస్క్ తీసుకుని అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతను కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ గాయం విషయం తెలిసిన అభిమానులు, అంత పెద్ద గాయం ఉన్నప్పుడు అసలు ఆడించాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

తర్వాతి మ్యాచ్‌లో నమీబియా పై అభిషేక్ శర్మ ఆడకపోవడానికి టీమ్ మేనేజ్మెంట్ వింత కారణం చెప్పింది. అతడికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకిందని, అందుకే విశ్రాంతి ఇచ్చామని ప్రకటించింది. అమెరికా మ్యాచ్ తర్వాత అతను ఆస్పత్రిలో చేరిన మాట నిజమే కానీ, అది చేతి గాయం వల్లనా లేక కడుపు నొప్పా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మళ్ళీ మైదానంలోకి వచ్చినప్పటికీ, పాత ఫామ్ మాత్రం అందుకోలేకపోయాడు.

ఈ మెగా టోర్నీలో అభిషేక్ శర్మ గణంకాలు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను చేసిన పరుగులు కేవలం 15 మాత్రమే. అవి కూడా సౌతాఫ్రికా పై వచ్చినవే. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను డకౌట్ కావడం గమనార్హం. టీమిండియా ఇంత పెద్ద సత్యాన్ని ఎందుకు దాచిపెట్టింది? జట్టులో ఇతర ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా గాయపడిన ఆటగాడిని ఎందుకు ఆడించింది? అనే ప్రశ్నలు ఇప్పుడు మేనేజ్మెంట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..