Reading Time: < 1 minute
Prashant Kishor Alleges Votes Bought With Rs 10000 Targets Nitish Kumar Before Bihar Polls

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీష్ కుమార్‌పై మరోసారి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల ఓట్లను రూ.10 వేలతో కొనుగోలు చేసి గెలిచారంటూ ధ్వజమెత్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహిళల ఓట్లను డబ్బుతో ప్రభావితం చేశారని ఆరోపించారు.

ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. “బీహార్ ఎన్నికలకు ముందు మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు కేవలం రూ.10 వేలే ఇచ్చి వారి ఓట్లను కొనుగోలు చేశారు. మహిళలను ఆకర్షించి వారి ఓట్లను ప్రభావితం చేశారు. ఈ అంశంపై జనసురాజ్ పార్టీ గతంలో కూడా గొంతెత్తింది.. ఇకపై కూడా పోరాడుతూనే ఉంటుంది” అని అన్నారు. అంతేకాకుండా నితీశ్ కుమార్‌పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించారు. “మహిళలకు రూ.2 లక్షల ఆశ చూపించి వారి ఓట్లు పొందిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయారు. రాష్ట్ర పాలనను తన పిల్లలు, సన్నిహితులు, అనుచరుల చేతుల్లో పెట్టారు” అని ఆరోపించారు.

బీహార్‌లో అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం కోసం జనసురాజ్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ, ఎన్డీయే కూటమి నేతలు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.