Reading Time: < 1 minute
Gunasekhar Reveals How Mahesh Babu Okkadu Story Was Born From Hyderabads Old City

Gunasekhar: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ‘ఒక్కడు’ ఒకటి. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుని మహేష్ స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. అయితే ఈ సినిమా కథ ఎలా పుట్టింది? మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని రాశారా? అనే ప్రశ్నలకు గుణశేఖర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు.

ఈ విషయమై దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. తాను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా చార్మినార్ ప్రాంతానికి వెళ్లి అక్కడ టీ తాగుతూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేవాడినని చెప్పారు. టీ తాగుతూ అక్కడి జనజీవనాన్ని గమనించే సమయంలో ఒక ఆలోచన తనకు వచ్చిందన్నారు. పాతబస్తీలో టీ తాగుతూ తిరిగే ఓ సాధారణ యువకుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కథ రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘ఒక్కడు’ కథకు బీజం పడిందని వెల్లడించారు.

ఆ సమయంలో మహేష్ బాబు చాలా క్లాస్ లుక్, సాఫిస్టికేటెడ్ ఇమేజ్‌తో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారని.. అలాంటి హీరోను పాతబస్తీ నేపథ్యంలో చూపిస్తే కొత్తదనంగా ఉంటుందని భావించానని తెలిపారు. ఆ కాంట్రాస్ట్‌నే ప్రధానంగా తీసుకుని కథను అభివృద్ధి చేశానని చెప్పారు. అంతేకాకుండా పాతబస్తీ నేపథ్యానికి రాయలసీమ ఫ్యాక్షన్ అంశాలను జోడించడంతో కథ మరింత బలంగా మారిందని తెలిపారు. కథ సహజంగా పాత్రలను సృష్టించిందని.. అందుకే ‘ఒక్కడు’ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయి భారీ విజయాన్ని సాధించిందన్నారు.

ఇదే సందర్భంలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘సైనికుడు’ సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘ఒక్కడు’, ‘అర్జున్’ చిత్రాల తర్వాత తాను హీరో ఇమేజ్.. భారీ కాన్వాస్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సైనికుడు’ కథను రూపొందించానని, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథ అల్లడం కంటే, కథలో నుంచే పాత్రలు పుట్టాలని తాను ఆ అనుభవం ద్వారా నేర్చుకున్నానని అన్నారు. “మహేష్ బాబు ఇమేజ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ‘ఒక్కడు’ కథ రాసి ఉంటే, అది కూడా ‘సైనికుడు’ తరహాలో మారిపోయి ఉండేదని అంటూ.. కథ ముందుగా పుట్టాలి, ఆ కథలోంచే పాత్రలు రావాలి” అంటూ గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.