Reading Time: 2 minutes
Nellore Political Families Prepare Daughters And Daughters In Law For Future Elections

Nellore Political Families Prepare Daughters for Future Elections: పొలిటికల్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తమ వారసులను రంగంలోకి దించేందుకు నెల్లూరు జిల్లా (సింహపురి) నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారం తమ కుటుంబం నుంచి చేజారకూడదనే గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్య నాయకులు.. వచ్చే ఎన్నికల్లో తమ కుమార్తెలను బరిలోకి దించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇప్పుడే తమ కూతుళ్లను జనంలోకి తీసుకెళ్తూ గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టం చేయడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.

ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతల కుమార్తెలు, కోడళ్లు పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చి యాక్టివ్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కోవూరు నుంచి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూళ్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీతో పాటు మరో ముగ్గురు నలుగురు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మరికొందరు సీనియర్ నేతలు తమ వారసురాళ్లను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన పెద్ద కుమార్తె కాకాని పూజిత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గ క్యాడర్ చెక్కుచెదరకుండా అండగా నిలిచారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఆమెకు మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆమె కోసం మరో నియోజకవర్గాన్ని కాకాని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం తన కూతురు ఆనం కైవల్యను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గానికి తీసుకువెళ్తూ ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్ వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారసత్వాన్ని అందుకోవడానికి ఆయన కుమార్తె వైష్ణవి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ తన కుమార్తె శరణ్‌ను జనంలో తిప్పుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె చూసుకుంటున్నారు.

కేవలం కుమార్తెలే కాకుండా కుటుంబంలోని ఇతర మహిళా సభ్యులను కూడా కీలక స్థానాల్లో నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కోడలు శృతి బరిలో ఉంటారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దీటుగా విమర్శలు చేయడంలో శృతి సక్సెస్ అయ్యారని, ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పేరు పరిశీలనలో ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కురుగొండల కుమార్తె లక్ష్మీ ప్రియ పేరు ఖరారైనప్పటికీ.. చివరి నిమిషంలో ఆయనే పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియ లేదా భార్య సింధు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తాము పదవుల్లో ఉన్నప్పుడే, అధిష్టానం ఆశీస్సులు ఉన్నప్పుడే వారసురాళ్లను పటిష్టంగా నిలబెట్టాలనే సింహపురి నేతల వ్యూహం ఏ మేరకు సఫలమవుతుందో, రాబోయే ఎన్నికల్లో ఎంతమంది మహిళా నేతలు అసెంబ్లీ మెట్లు ఎక్కుతారో చూడాలి.