Reading Time: 2 minutes
Venkatesh Iyer Opens Up On Social Media Trolling Reveals Turning Point In Rcb Ipl 2026 Campaign

Venkatesh Iyer Reveals Turning Point in RCB IPL 2026 Campaign: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.ఆర్సీబీ విజయాల్లో స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి వెంకీ మనసు విప్పాడు. సోషల్ మీడియాలో ఎదురైన విమర్శలు, ట్రోలింగ్ తనను ప్రభావితం చేశాయని అంగీకరించిన వెంకటేశ్.. వాటికి స్పందించకుండా తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వెంకటేశ్ అయ్యర్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్త జట్టులోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగినప్పటికీ.. వెంకీ తన ఆటపై దృష్టి పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేశ్.. ‘సోషల్ మీడియా విమర్శలు నన్ను ప్రభావితం చేయలేదని చెబితే అది అబద్ధం అవుతుంది. అవి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. కానీ వాటికి నేను ఎప్పుడూ స్పందించలేదు. ఇది నా జీవితం, నా కెరీర్. దానికి పూర్తి బాధ్యత నాదే. నేను బాగా ఆడనప్పుడు నాకు తెలుస్తుంది. దాన్ని ఇతరులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గురించి నాకు అవగాహన ఉంది’ అని చెప్పాడు.

సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ అనేవి క్రీడాకారుల జీవితంలో భాగమని వెంకటేశ్ అభిప్రాయపడ్డాడు. ‘బాగా ఆడినా ప్రజలు మాట్లాడతారు, బాగా ఆడకపోయినా మాట్లాడతారు. మనం నియంత్రించగలిగేది మన కృషి, మన వైఖరి మాత్రమే. ముఖ్యంగా మన దృక్పథాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. నేను అదే చేయడానికి ప్రయత్నించాను’ అని తెలిపాడు. ఆర్సీబీ జట్టు వాతావరణం తనకు ఎంతో సహాయపడిందని వెంకటేశ్ పేర్కొన్నాడు. ‘ఆర్సీబీ జట్టులో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ రాలేదు. నేను ఈ జట్టులో భాగం కాదనే భావన కూడా రాలేదు. పూర్తిగా ఇంట్లో ఉన్నట్లే అనిపించింది. అదే నాకు ముందుకు సాగే శక్తిని ఇచ్చింది’ అని చెప్పాడు.

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తన కెరీర్‌లో కీలక మలుపుగా మారిందని వెంకటేశ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో గాయంతో కెప్టెన్ రజత్ పాటిదార్ దూరమైన తర్వాత అవకాశం దక్కించుకున్న వెంకటేశ్.. అజేయంగా 73 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత జట్టులో తన స్థానం స్థిరపడింది. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఏ బ్యాటర్‌కైనా తొలి 10 బంతులే అత్యంత కీలకం. లెజెండరీ ఆటగాళ్లకైనా అదే వర్తిస్తుంది. మీరు నిరంతరం మ్యాచ్‌లు ఆడితే ఆ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ అవకాశాలు రాకపోతే తొలి కొన్ని బంతుల్లోనే మీరు మీ లయను వెతుక్కోవాలి’ అని వివరించాడు.

పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఉపయోగపడిందని వెంకటేశ్ చెప్పాడు. ‘ఆ మ్యాచ్‌లో నేను కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేశాను. అప్పటికే మంచి ఆరంభం లభించింది. అందుకే నేను తొందరపడాల్సిన అవసరం రాలేదు. ఒకసారి బంతి బ్యాట్ మధ్యలో తగలడం ప్రారంభమైతే మిగతా విషయాలన్నీ మర్చిపోతారు. అప్పుడంతా బంతిని ఎలా ఆడాలన్నదే ఆలోచన. అదే క్రికెట్ మ్యాజిక్’ అని పేర్కొన్నాడు.