Reading Time: < 1 minute

ఇసుక రవాణాపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ఆదేశాలు..

Caption of Image.

ఇసుక రవాణా, నిర్వహణపై టీజీఎండీసీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం ( జూన్ 6 ) టీజీఎండీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యత, ఇసుక తవ్వకాల నిర్వహణ, ఆదాయ పరిస్థితి, ఆదాయ వృద్ధి అవకాశాలు, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకతను పాటించాలని అధికారులకు సూచించారు మంత్రి వివేక్.

ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని… లారీల కదలికలను నిరంతరం పర్యవేక్షించే బలమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టాలని పేర్కొన్నారు. టీజీఎండీసీ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదాయ వృద్ధి, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం, అక్రమ మైనింగ్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

►ALSO READ | అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తాడు… అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్:ఎంపీ చామల కిరణ్ కుమార్ 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక ఖనిజాలు, ఇతర ఖనిజాల అన్వేషణకు సంబంధించి కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందజేశారు. ఖనిజాల అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రాధాన్యత అంశాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్.

సాండ్ బజార్ల పనితీరు, శాఖ నిఘా వ్యవస్థ, సిబ్బంది అవసరాలపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఖనిజ వనరుల సమర్థ నిర్వహణ కోసం అమలు వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు మంత్రి వివేక్.

©️ VIL Media Pvt Ltd.