Reading Time: < 1 minute
Oil India Discovers Natural Gas Andaman Sea Sri Vijayapuram 3

Natural gas: ఇంధన రంగంలో భారత్‌కు ఇది భారీ శుభవార్త. అండమాన్ సముద్రంలో సహజ వాయువు(నేచురల్ గ్యాస్) నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న ‘‘శ్రీ విజయపురం-3’’ బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోని ఈయోసిన్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్‌ను మండించడం ద్వారా సహజవాయువు ఉనికిని గుర్తించారు.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు, దాని రసాయనిక స్వరూపం, కిలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తోంది. భారతదేశ తీర ప్రాంతాల్లో, అత్యంత లోతైన జనాల్లో అన్వేషన చేయడానికి కేంద్రం ప్రకటించిన ‘‘సముద్ర మంథన్ మిషన్’’లో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.

ప్రస్తుతం, అండమాన్ బేసిన్‌లో ఆయిల్ ఇండియా తవ్విన మూడు బావుల్లో రెండింటిలో హైడ్రోకార్బన్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్‌లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశం మారే అవకాశాలు ఉన్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ తో పాటు ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ ప్రాంతాల్లో ఏదైనా సంక్షోభం నెలకొంటే, దేశంలో ఇంధన ధరలు పెరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధం వల్ల భారత్ ఇంధన రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.