Reading Time: 2 minutes
Nandus World Youtuber Rama Nandana Madhukar Fraud Allegations Lookout Notices

Lookout Notices Issued Against YouTuber Rama Nandana and Husband Madhukar: సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్.. నోరు తెరిస్తే చాలు విదేశీ ముచ్చట్లు చెప్పే రమానందన, ఆమె భర్త మధుకర్ దంపతుల లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక అమాయకులను ముంచేసే పెద్ద స్కెచ్ ఉందనే నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన పాపులారిటీని పెట్టుబడిగా మార్చుకున్న ఈ దంపతులు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ కార్యాలయాలను తెరిచారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాగించిన వీరి వసూళ్ల పర్వం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా పోలీసులు రమానందన, ఆమె భర్త మధుకర్‌కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అయితే.. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే యువకుడు తన వీసా రెన్యువల్, భార్యకు ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్‌ను నమ్మి సంప్రదించాడు. మధుకర్ మాటలు నమ్మిన శివ క్రాంతి, గుంటూరులోని కన్సల్టెన్సీలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్‌రావును కలిసి రూ.15 లక్షలు ముట్టజెప్పాడు. డబ్బులు తీసుకున్న రెండు నెలల తర్వాత ‘అగార్డ్ సొల్యూషన్స్’ అనే కంపెనీ పేరుతో వీరు ఒక స్పాన్సర్‌షిప్ లెటర్ (COS) పంపించారు. అయితే అనుమానం వచ్చి శివ క్రాంతి ఆ కంపెనీ యజమానిని ఆరా తీయగా, తాను దేశంలో లేని సమయంలో తన పేరుతో మధుకర్ తప్పుడు లెటర్ సృష్టించాడనే అసలు నిజం బయటపడింది. మోసపోయానని గ్రహించి డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీస్తే కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా దానికి మొహం చాటేశారు. బాధిత యువకుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గత ఏడాది నవంబర్‌లోనే కేసు నమోదు చేసి మధుకర్‌ను A1గా, రమా నందనను A2గా, మోహన్‌రావును A3గా చేర్చారు. పోలీసుల నోటీసులకు వీరు స్పందించకపోగా, కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ దశలో ఉంది. ఇంతలో తాజాగా శుక్రవారం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అంతేకాదు.. ఇది కేవలం ఒక్క శివ క్రాంతి కథ మాత్రమే కాదు, ఏపీ, తెలంగాణలతో పాటు గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది వీరి చేతిలో మోసపోయినట్లు, ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘోర ఆరోపణలపై యూట్యూబర్ రమా నందన తన ఛానల్ ద్వారా ఒక వీడియో విడుదల చేస్తూ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. తమపై వ్యక్తిగత కక్షతోనే కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని, తన పేరు మీద కానీ, తన భర్త పేరు మీద కానీ ఎలాంటి కంపెనీలు లేవని బుకాయించారు. ఎవరో తమ పేర్లు వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారని, లండన్ నుంచి భారత్ వచ్చి మరీ కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. మరోవైపు.. తమను నమ్మించి గొంతుకోశారని బాధితులు వాపోతున్నారు.