Reading Time: < 1 minute
Tirumala Sets Record As 25 46 Lakh Devotees Visit Srivari Temple In May 2026

వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు, అనుకూల ఏర్పాట్లు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

టీటీడీ గణాంకాల ప్రకారం.. 2026 మే నెలలో మొత్తం 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే మే నెలలో 23.76 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి దాదాపుగా రెండు లక్షల మంది అధికంగా భక్తులు తిరుమలకు వచ్చారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) కీలక పాత్ర పోషించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, వసతి కేంద్రాలు, రవాణా సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం వల్ల భక్తులకు ఇబ్బందులు లేవని తెలిపారు.

భక్తుల రద్దీ పెరిగినప్పటికీ దర్శన ఏర్పాట్లు, లడ్డూ పంపిణీ, వసతి సదుపాయాలు, భద్రతా చర్యలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా టీటీడీ మరోసారి తన నిర్వహణ సామర్థ్యాన్ని చాటుకుంది. భవిష్యత్తులో కూడా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో.. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. మే నెలలో నమోదైన ఈ రికార్డు సంఖ్య టీటీడీ చరిత్రలో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.