
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనిని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలామంది అది ఒక సాహసమని భావించారు. కానీ, ఈ సీజన్లో అతను ఆడిన తీరు ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 400 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న ఈ బీహార్ కుర్రాడిపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో అతను ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లకు వెళ్లే అవకాశం ఉందంటూ ‘ప్లేయర్ రిటెన్షన్’ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ వ్యవస్థను ప్రశంసిస్తూనే బ్రాడ్ ఒక భయాన్ని వ్యక్తం చేశారు. “వైభవ్ లాంటి అసాధారణ ప్రతిభావంతుడిని 10 ఏళ్ల కాంట్రాక్ట్పై ఉంచుకోవడం సాధ్యం కాదు. అతను తదుపరి రిటెన్షన్ సమయంలో వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటే, ముంబై ఇండియన్స్ వంటి జట్లు భారీ ఆఫర్లతో అతడిని చేజిక్కించుకోవచ్చు. తన విలువను గుర్తించిన వైభవ్, ఫ్రాంచైజీల నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది” అని బ్రాడ్ విశ్లేషించారు.
బట్లర్ ప్రశంసలు..
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న జోస్ బట్లర్ కూడా వైభవ్ ఆట తీరుకు ఫిదా అయ్యారు. “జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి మేటి బౌలర్లను ఎదుర్కొంటూ మొదటి బంతికే సిక్సర్లు కొట్టడం మామూలు విషయం కాదు. అతను తన పీక్ ఫామ్లో ఉన్న క్రిస్ గేల్ లేదా వీరేంద్ర సెహ్వాగ్లా ఆడుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఇంతటి నిర్భయమైన క్రికెట్ ఆడటం అద్భుతం” అని కొనియాడారు.
రికార్డు స్థాయి ప్రదర్శన..
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ 9 ఇన్నింగ్స్ల్లో 400 పరుగులు చేశాడు. 238.09 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ జుబిన్ భరూచా వెల్లడించిన వివరాల ప్రకారం.. వైభవ్ కోసం వేలంలో రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయడానికి జట్టు సిద్ధంగా ఉందట. ఈ కుర్రాడు చూపిస్తున్న జోరు చూస్తుంటే, టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది.