Reading Time: 2 minutes
Sajjala Ramakrishna Reddy Alleges Corruption And Broken Promises In Chandrababus Two Year Rule

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిన నేపథ్యంలో చేసిన అప్పులను, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసిందని సజ్జల పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలకు చేసిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అన్నీ సాధించామని ప్రచారం చేసుకుంటోందని, అయితే వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ప్రజల్లో, మేధావుల్లో చర్చ జరిగేలా ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. రేపు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుక్‌లెట్‌లో ప్రస్తావించిన అంశాలు చాలా స్వల్పమేనని, రాష్ట్రం ప్రస్తుతం పడిపోయిన పరిస్థితి నుంచి గాడిలో పడాలంటే భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశముందని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీనియర్ నాయకులతో చర్చించి ఈ కార్యక్రమాల రూపకల్పన చేసినట్లు తెలిపారు.

2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో నిలిచిందని సజ్జల పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా వదిలేసిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ముఖ్యంగా డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించిన సజ్జల, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ నియామకాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని, సాక్ష్యాలతో సహా విషయాలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. తాడు లాగే పోటీల్లో గెలిచిన వారికి కూడా టీచర్ పోస్టులు ఇచ్చారని, అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి తమకు నచ్చిన వారిని ఉద్యోగాల్లో నియమించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మెడలు వంచిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్న పరిస్థితి నెలకొందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.