Reading Time: < 1 minute
Cm Revanth Reddy Focuses On Rs 1000 Crore Disaster Fund Issues Strict Warning To Officials

CM Revanth: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.

సమీక్ష సందర్భంగా రైతులకు వర్షాభావ పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. అలాగే పంటల మార్పిడి, పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరించాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల పనులపై కూడా సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

విపత్తు నిర్వహణ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రూ.1000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా వినియోగించాలని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశువుల నష్టం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణ రైతుల అవసరాల కోసం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.